తేజస్వి సూర్య వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారు: రాంచందర్ రావు
- బీజేపీ మద్దతు వల్లే తెలంగాణ ఏర్పడిందన్న రాంచందర్ రావు
- విభజన సమయంలో అశాస్త్రీయ పరిణామాలను తేజస్వి సూర్య ప్రస్తావించి ఉండవచ్చని వ్యాఖ్య
- ఆ సమయంలో బీఆర్ఎస్కు ఇద్దరు సభ్యులు కూడా లేరని ఎద్దేవా
తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు కావాలనే రాజకీయ లబ్ధి కోసం వక్రీకరిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రాంచందర్ రావు మండిపడ్డారు. తేజస్వి సూర్య ఉద్దేశం తెలంగాణను కించపరచడం కాదని ఆయన స్పష్టం చేశారు. విభజన సమయంలో చోటుచేసుకున్న అశాస్త్రీయ పరిణామాలను ప్రస్తావించి ఉండవచ్చని, దానిని బీఆర్ఎస్ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటూ రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.
పార్లమెంట్లో నాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సంపూర్ణ మద్దతు ఇవ్వబట్టే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని... బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో లోక్సభలో బీఆర్ఎస్కు (నాడు టీఆర్ఎస్) కనీసం ఇద్దరు సభ్యులు కూడా లేరని, కేవలం తమ పార్టీ మద్దతుతోనే బిల్లు పాస్ అయిందన్న నిజాన్ని గ్రహించాలని గుర్తు చేశారు.
రాష్ట్రం ఇచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు యూటర్న్లు తీసుకుందని, ఆ పార్టీ ద్వంద్వ వైఖరి వల్లే ఉద్యమం సుదీర్ఘకాలం సాగిందని రాంచందరర్ రావు ఆరోపించారు.